ఆత్రేయ మనసు నొచ్చుకున్న ఆ రెండు సంఘటనలు 
తెలుగు సినిమాను సగటు ప్రేక్షకుడు దగ్గరకు చేర్చిన రచయితల్లో ఆచార్య ఆత్రేయ మొదటి స్థానంలో ఉంటాడు . ఆయన మాటలు, పాటలు కూడా చక్కటి భావంతో , భాషతో వుంటాయని విమర్శకులు సైతం చెబుతారు. అయితే కాలానుగుణంగా ఆయన  మాటల్లో  పాటల్లో  ద్వందార్ధాలు వస్తున్నాయని, అందుకే  ఆయన్ని బూత్రేయ అని కూడా వ్యగ్యంగా పిలిచేవారు . అయితే ఆ విమర్శ పక్కన పెడితే  తెలుగు సినిమా ఎదుగుదలకు ఆత్రేయ  తన రచనల ద్వారా ఎంతో దోహదం చేశాడని చెప్పవచ్చు . 

ఆత్రేయ భౌతికంగా మనకు దూరమై మూడు దశాబ్దాలు అవుతుంది.  .సోమవారం ఆత్రేయ 32వ వర్ధంతి . ఈ సందర్భంగా ఆయన ప్రతిభా  పాటవాలు, వ్యక్తిత్యం గురించి తెలుసుకుందాం .

ఆత్రేయ అసలు పేరు కిలాంభి వెంకట నరసింహా చార్యులు . ఆయన 7 మే 1921న నెల్లూరు లోని మంగళంపాడు గ్రామంలో జన్మించాడు .హైస్కూల్ విద్యాభ్యాసం అనంతరం ఆయన్ని స్వాతంత్రోద్యమం బాగా ఆకట్టుకుంది . నాయకుల విన్యాసాలకు ప్రభావితం అయ్యాడు .  చిన్న వయసులోనే  క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని  జైలు జీవితం అనుభవించాడు.  జైలు జీవితం ముగిచాక బయటికి వచ్చి చిన్న వుద్యోగం చేశాడు కానీ అది అంత నచ్చలేదు.  నెల్లూరులోని జమీన్ రైతు పత్రికలో సబ్ ఎడిటర్ గా చేరాడు  . అప్పటికే అనేక నాటకాలు , నాటకాలు రాసి స్టేజి మీద ప్రదర్శింప చేశాడు . ఆత్రేయ రచనలను  జనం బాగా ఇష్టపడేవారు , నాటకాలకు బహుమతులు కూడా వచ్చాయి .

ఆత్రేయ రాసిన నాటికల్లో  , భయం, విశ్వ శాంతి, కప్పలు, గౌతమ బుద్ధ , సామ్రాట్ అశోక , పరివర్తనం, ఎదురీత , తిరుపతి ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి . ఆత్రేయలోని  ప్రతిభను గమనించిన మిత్రులు సినిమా రంగంలోకి వెళ్ళమని సలహా ఇచ్చి , ప్రోత్సహించారు . మిత్రుల బలవంతం ,మనసులోని  కోరిక ఆయన్ని మద్రాస్ వైపు నడిపించాయి. 
1951లో దర్శకుడు కె .ఎస్ ప్రకాశరావు   “దీక్ష ” అనే సినిమాలో ఆత్రేయను పరిచయం చేశాడు . ఈ చిత్రంలో “పోరా బాబు పో ” అనే పాట ఆరోజుల్లో బాగా పాపులర్ అయ్యింది . ఆత్రేయ మీద సినిమా వారి దృష్టి పడింది . అక్కడ నుంచి ఆత్రేయ సినిమా రంగంలో రచయితగా ప్రయాణం మొదలు పెట్టాడు. 

అనతి కాలంలోనే ఆత్రేయ ప్రతిభను నిర్మాతలు , దర్శకులు గుర్తించారు . తమ సినిమాల్లో మాటలు రాయమని కొందరు , పాటలు రాసిపెట్టామని మరి కొందరు ఆయన మీద వత్తిడి తీసుకరావడం మొదలు పెట్టారు . ఆత్రేయ సామాన్యుడు కు కూడా సులభంగా అర్ధమయ్యేలా రాయడమే ఆయన విజయానికి దోహదం చేసిందని చెప్పవచ్చు . ఆరోజుల్లో మాటలు ,పాటలు రాస్తూ ఎంతో బిజీ గా ఉండేవాడు . ఆత్రేయ రాయక నిర్మాతల్ని, రాసిన తరువాత  ప్రేక్షకులను ఏడిపిస్తారని నిర్మాతలు చెప్పేవారు . ఆత్రేయ పెద్దగా చదువుకోక పోయినా జీవితానుభవంతో రాసే రాతలు ప్రజల మనస్సులో మెదులుతూ ఉండేవి . ముఖ్యంగా మనసు గురించి ఆయన రాసిన మాటలు , పాటలు ఎంతో ఆకట్టుకునేవి . అలతి ,అలతి పదాల్లోనే జీవిత సారాన్ని హృద్యంగా చెప్పేవాడు . .

1989 లో  వెంకటేష్ , రేవతి నటించిన సురేష్ ప్రొడక్షన్ వారి “ప్రేమ” ఆత్రేయ  చివరి సినిమా. ఆ సినిమాలో మాటలు, పాటల్లో ఆత్రేయ ముద్ర కనిపిస్తుంది . 
ఆత్రేయ పై ప్రభావితం చూపించిన రెండు సంఘటనలు . 

1964లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర రావు , సావిత్రి, జమున నటించిన “మూగమనసులు ” విడుదలైంది.  
 ఈ సినిమాలోజమున ధరించిన గౌరీ  పాత్ర  కోసం ఆత్రేయ రాసిన ” మాను మాకును కాను .. రాయి రప్పను కానే కాను మామూలు మణిసిని నేను ..” పాట పెను దుమారం రేపింది .  .

ఈ పాట రాసినప్పుడు కాగితాలు ఆత్రేయ  ముఖంపై గిరాటేశారట . "ఆత్రేయా మతి వుండే రాశావా ? తాగి  ఉన్మాద స్థితిలో రాశావా ? మాను మాకును కాను .. రాయి రప్పను కానే కాను .. ఏమిటిది ? ఇది పాటా ?" అని ఎగతాళి చేశారట  .మూగమసులు  సినిమాలో ఒక గొప్ప ప్రయోగం చేశానని ఆయన మురిసి పోతుంటే … ఈ మాటలు  అమితంగా బాధించాయి, కన్నీళ్లు ఉబికి వచ్చాయి . బలవంతంగా ఆపుకుని .. "ఈ ఒక్క పాట నాకోసం ఉంచండి … మీలాగా జనం కూడా ఛీ కొడితే… ఇక నేను పాటలు రాయడం మానేస్తా " అని చెప్పి వారిని ఒప్పించారట . సినిమా విడుదల తరువాత . ఆ పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలుసు .

ఇక అదే సంవత్సరం జగపతి రాజేంద్ర ప్రసాద్ తాను నిర్మిస్తున్న “ఆత్మ బలం ” సినిమాకు ఓ పాట రాయమని ఆత్రేయకు కబురు పంపించారు . జగపతి సంస్థ కాబట్టి ఆత్రేయ సరే అన్నాడు  ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వర్ రావు, బి .సజోజాదేవి ప్రధాన జంట . వి. మధుసూదన రావు దర్శకుడు . మద్రాసులో ఉంటే ఆత్రేయ పాట రాయడని బెంగుళూర్ తీసుకెళ్లారు. అక్కడ పెద్ద హోటల్లో వున్నాం , రాజేంద్ర ప్రసాద్ గారి మర్యాదల గురించి చెప్పేదేముంది . ఏది కావాలన్నా క్షణాల్లో కళ్ళ ముందు ఉంటుంది . బెంగుళూరు లో వారం పది రోజులవుతున్నా ఆత్రేయ పాట కాదు కదా పల్లవి కూడా రాలేదు . రాజేంద్ర ప్రసాద్ గారు ఆత్రేయతో  “డబ్బు అయిపోతుంది తప్ప మీరు పాట రాయడం లేదు”. ఆ మాటలకు ఆత్రేయలో కోపం వచ్చింది .  "అంటే ప్రసాదు గారు నేను కావాలనే రాయడం లేదని మీ ఉద్దేశ్యమా ?" అని రోషంగా అన్నాడు . 
ఆరోజు సాయంత్రం  మనసు బాగాలేక కాస్త రిలీఫ్ కోసం  గబ్బన్ పార్క్ కు వెళ్ళాడు . . పార్కు లో సందర్శకులు బాగానే వున్నారు.  ఆత్రేయ అందరినీ చూస్తూ అలా తిరుగుతున్నాడు . కాసేపటి తరువాత మెల్లగా  చినుకులు పడటం మొదలయ్యాయి . పార్క్ లో విహారానికి  వచ్చిన జంటలు వర్షం పెద్దది అవడంతో ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని  చెట్టు నీడకు వెడుతున్న దృశ్యం ఆత్రేయలో ప్రేరణ కలిగించింది . వెంటనే ఆయన మనసులో  “చిటపట చినుకులు పడుతూవుంటే .. చెలికాడే సరసన ఉంటే.. “.అనే పల్లవి వచ్చేసింది . “ఆత్మబలం ” సినిమా లో ఈ పాట కుర్ర కారునే కాదు , వయసు మళ్ళిన జంటలను ఉర్రూతలూగించింది.  

"పాట పుట్టుక  పాపాయి పుట్టుక వంటిది.  మంచి పాటకోసం చాలా కాలం వేచి వుండాల్చి వస్తుంది. పురిటి నొప్పులూ పడాలి"   అంటారు ఆత్రేయ.
మనసు కవి ఆత్రేయ ఎన్నో విలక్షణ మైన పాటలు రాశాడు .  ఆ పాటలు  ఎప్పటికీ  ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటాయి . 
- భగీరథ 


 

Comments

Popular posts from this blog