సావేరి 'నిష్ఫల ప్రేమ'. మేల్ ప్రాస్టిట్యూషన్ గురించి తెలుగు సాహిత్యంలో వచ్చిన నవలలు చాలా అరుదు. ఈ నేపథ్యంతో నవల రాయడం సాహసమే. ఇటువంటి సాహసాన్నిసీనియర్ జర్నలిస్ట్ మరియు రచయిత అయిన భగీరథ గారు తన రెండో నవల ‘సావేరి’ ద్వారా చేశారు. ఈ నవల ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది. 2010 లో నవలగా వెలువడింది. ఈ సంస్కృతి గురించి అప్పట్లో దిన పత్రికలో వచ్చిన ఓ వార్త ఆధారంగా ఈ నవలను రాసినట్టు రచయిత తన ముందుమాటలో పేర్కొన్నారు. అలాగే ఈ సావేరి కథను సినిమాగా తీయాలని నటి జయసుధ గారు అనుకున్నప్పటికి అది సాధ్యపడలేదని కూడా రాశారు. కలకత్తా వేదికగా ఈ కథ జరిగినా, ఈ కథ ద్వారా మనసులు మలీనం కానంతవరకు శరీరాలు కావు అని చెప్పే ప్రయత్నం చేసినా ఆ సూత్రం ఒక్క శ్రీరాజ్ పాత్రకు మాత్రమే వర్తించి, గీతాంజలి పాత్రకు అంతగా వర్తించలేదేమో అనిపిస్తుంది. శ్రీరాజ్ అనే యువకుడు అమెరికాలో విద్య పూర్తి చేసుకుని హైదరాబాద్ లో స్థిరపడతాడు. ఒక ఎలక్ట్రానిక్ కంపెనీలో సాంకేతిక సలహాదారుడుగా నియమితులవుతాడు. ఆ సందర్భంగా పరిచయాలు పెంచుకొవడానికి స్టార్ హోటల్ లో ఓ పార్...