ఈరోజు వేటూరి సుందర రామమూర్తి  గారి వర్ధంతి 


వేటూరి వారు మన మధ్య లేకపోయినా వారి  పాట  తెలుగు  సినిమా పూతోటలో ఎప్పటికీ మరిమళిస్తూనే ఉంటుంది. 

జర్నలిస్టుగా జీవితాన్ని మొదలు పెట్టి ఆ తరువాత సినిమా పాటల రచయితగా అటు క్లాస్ ఇటు మాస్ ను మెప్పించిన 

మహాకవి వేటూరి .సుందర రామమూర్తి . 

వేటూరి గారిని తలచుకోగానే 25 సంవత్సరాల నాటి ఓ మధురమైన సంఘటన గుర్తుకొస్తుంది . 

1996లో మిత్రులు ప్రసాద్ రెడ్డి, అంజి రెడ్డి నిర్మాతలుగా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నిర్మించిన "ప్రియమైన శ్రీవారు " సినిమాకు 

వేటూరి గారితో ఓ పాట వ్రాయిద్దామని మిత్రుడు , సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ నాతో చెప్పాడు . తప్పకుండా వ్రాయిద్దాం అని చెప్పాను . ఈ సినిమాలో ఓ నేపధ్య గీతం ఉంది . ఈ పాట  అయితే బాగుంటుందని మా ఇద్దరికీ అనిపించింది . 

వేటూరి గారి ఇంటికి వెళ్లి పాట సన్నివేశం వివరించాము . వారం రోజుల తరువాత పాట  సిద్ధమైంది . వేటూరి వారి ఇంటికి  పాట  కోసం నేను వెళ్ళాను . ఆయన పాట రెడీ అయ్యిందని చెప్పారు . ఓసారి పాట వినిపించారు . చాలా బాగుంది అని చెప్పాను . 

 " ఈ గీతాన్ని ఎవరితో పాడించాలని అనుకుంటున్నారు ?' అని అడిగారు . 

"ఇప్పటికే రెండు పాటలు బాలు గారు పాడారు" అని చెప్పాను . 

"ఈ పాట ను మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పాడించగలరా ? " అన్నారు . 

"మంగళంపల్లి వారు ఇప్పుడు సినిమాలకు పాడటం లేదుగా " అన్నాను . 

"మీరు జర్నలిస్ట్ కదా ప్రయత్నిచండి , మంగళంపల్లి నా అభిమాన గాయకుడు " అని నా వైపు చూశారు . 

" తప్పకుండా సార్ " అని  చెప్పాను . 

"మీతో పాటు మంగళంపల్లి ఇంటికి  నేను కూడా వస్తాను , మీరు అపాయింట్మెంట్ తీసుకోండి " అని చెప్పారు. 

అలాగే అని నేను చెప్పాను . ఈ విషయం వందేమాతరం కు  చెప్పగానే చాలా సంతోషపడ్డాడు . 

"గురూజీ మీరు ప్రయత్నం చేస్తే ఒప్పుకుంటారు " అన్నాడు . "అలాగే శ్రీను " అని చెప్పాను . 

రెండు రోజుల తరువాత   మంగళంపల్లి వారితో మాట్లాడాను .  వారు నన్ను గుర్తు పట్టి ఇంటికి రమ్మని చెప్పారు . 

నేను హైదరాబాద్ ఫిలిం క్రిటిక్స్ కార్యదర్శి గా వున్నపుడు ఒక సమావేశానికి మంగళంపల్లి వారిని ఆహ్వానించాము . మా జర్నలిస్టు మిత్రులతో రెండు గంటల పాటు తన అనుభవాలను పంచుకున్నారు . 

అలా ఆ పరిచయం ఇప్పుడు ఉపయోగపడింది . 

తరువాత రోజు వేటూరిగారు  , వందేమాతరం , ప్రసాద్ రెడ్డి ,నేను , మా మద్రాస్ ప్రొడక్షన్ మేనేజర్ మురళి  సాయంత్రం ఆరు గంటలకు వారి ఇంటికి వెళ్ళాం . కారు దిగుతూ ఉండగానే పెద్ద వర్షం . 

మా అందరినీ సాదరంగా ఆహ్వానించి మంచి కాఫీ తెప్పించారు . ఆ చలిలో కాఫీ తాగగానే ఉత్సాహం వచ్చింది . 

రెండు గంటల పాటు  మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారితో గడిపాము . బాలమురళి గారు  ఒప్పుకున్నారు . 

ఆ మరుసటి రోజు మంగళంపల్లి వారు వాహిని స్టూడియోస్ కు వచ్చారు. పాట  రికార్డింగ్ తరువాత తీసిన ఫోటో ఇది .

అలా వేటూరి సుందర రామమూర్తి గారి కోరిక , వందేమాతరం శ్రీనివాస్ జీవితంలో మర్చిపోలేని పాట ఇది . 

ఇక  బాలమురళి కృష్ణ గారు ప్రియమైన శ్రీవారు సినిమాలో పాడిన ఆ పాట . 

"జాతకాలు కలసే  వేళ  జీవితాలు  ముగిశాయి " ఆమని ,సుమన్ తదితరులమీద చిత్రీకరించిన గీతం

Comments

Popular posts from this blog