ఈరోజు మహాకవి డాక్టర్ దాశరథి గారి శత జయంతి. 


దాశరథి గారితో నాకు 1980 నుంచి పరిచయం వుంది . ఆయన తో నేను చేసిన ఓ ఇంటర్వ్యూ అప్పట్లో సంచలన సృష్టించింది. వ్యక్తిగా ఎంత మృదువైన వాడో కవిగా అంత దృఢమైన వాడు. కవిగా ఆయన ఎప్పుడూ రాజీపడలేదు, ఎవరికీ భయపడలేదు. 

తెలంగాణ సమాజం గర్వించతగ్గ కళాప్రపూర్ణుడు. 

దాశరథి కృష్ణమాచార్య అరుదైన మహాకవి , అభ్యుదయవాది. 

 దాశరథి గారు నిజాం ప్రభువును ఎదిరించి, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అక్షర యోధుడు. 

"ఓ నిజాము పిశాచమా, కానరాడు

నిన్ను బోలిన రాజు మాకెన్నడేని

తీగలను తెంపి అగ్నిలో దింపినావు

నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని నినదించిన అభ్యుదయ కవిసమ్రాట్ దాశరధి. 

దాశరథి కృష్ణమాచార్య  గారు చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. అయితే ఆయన బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. 

దాశరథి గారు ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ చదివాడు. 

దాశరథి గారికి  తెలుగుతో పాటు సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం వుంది.

దాశరథిగారు 'గాలిబ్ గీతాలు'  అనే కవితాసంపుటిని  పద్మవిభూషన్  అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితమిచ్చారు. 

1961లో 'ఇద్దరు మిత్రులు' సినిమాలో 'ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ....' అనే పాటతో సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాలో కథానాయకుడు అక్కినేని మహేశ్వర రావు. దుక్కిపాటి మధుసూదన రావు నిర్మాత, ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు, సాలూరి రాజేశ్వర రావు సంగీత దర్శకుడు . ఆ తరువాత 1971 వరకు కొన్ని వందల పాటలను రచించారు .

దాశరధి గారి చివరి చిత్రం 'శ్రీమంతుడు' . 971లో వచ్చిన ఈ చిత్రంలో 'ఎంతో చిన్నది జీవితం ఇంకా చిన్నది యవ్వనం...' అన్న పాటతో సినిమా జీవితానికి స్వస్తి చెప్పారు . శ్రీమంతుడు సినిమా కథానాయకుడు అక్కినేని నాగేశ్వరావు కావడం కాకతాళీయం కావచ్చు . 

 దాశరథి గారు 1977  నుండి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా పనిచేశాడు.


దాశరథి గారు జులై 22 1925 న జన్మిచారు. 1987 నవంబర్ 5న హైద్రాబాద్ లో 62వ ఏట మృతి చెందారు. 

దాశరథి గారి సాహిత్యం ఉన్నంత కాలం ఆయన మన మనస్సులో సుస్థిరంగా వుంటారు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు