భగీరథ ప్రయత్నం "మీర్జాపురంరాణి - కృష్ణవేణి"


భగీరథ తాజా పుస్తకం "మీర్జాపురంరాణి - కృష్ణవేణి " చదివాను .

ఇది అలనాటి నటీమణి కృష్ణవేణి గారి జీవిత చరిత్ర . జీవిత చరిత్రలు చదవడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి .

అయితే జీవిత చరిత్ర అనగానే ఆయా వ్యక్తుల జీవితాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని మాత్రమే రచయితు రాస్తుంటారు .


ఇందులో ఆయా కాలానికి సంబంధించిన విషయాలు , సంఘటనలు బహు అరుదుగా కనిపిస్తాయి . రచయితలు కేవలం ఆయా వ్యక్తుల మీదనే ఎక్కువ ద్రుష్టి కేంద్రీకరిస్తారు . మిగతావి పట్టించుకోరు . 

"మీర్జాపురం రాణి - కృష్ణవేణి ' ఈ ధోరణికి భిన్నంగా , సరికొత్తగా , ఆయా కాలంలో జరిగిన సంఘటనలు , ఆ వ్యక్తి పై ప్రభావం చూపించిన వ్యక్తులు , ఆ ఘటనల పూర్వాపరాలను సరళమైన భాషలో వివరించడం దీని ప్రత్యేకత. అందువల్లనే ఈ రచనకు పరిపూర్ణత వచ్చింది . 

భగీరథ ఇంతకు ముందు వ్రాసిన చారిత్రిక నవల "నాగలాదేవి "  తెలుగు నవలా సాహిత్యంలో ఓ ట్రెండ్ సెట్టర్ . ఎందుకంటే ఈ నవలలో రచయిత ఓ గొప్ప ప్రయోగం చేశారు . శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన చారిత్రిక ఘట్టాలను , నాగలాదేవి జీవితానికి  సంబందించిన  కల్పిత ఘటనలను  సమాంతరంగా నడిపించడం అపూర్వం , అద్భుత ప్రయోగం . బహుశ గతంలో ఏ  రచయితా ఇలాంటి ప్రయోగం చెయ్యలేదేమో . అదీ కాక  ఈ రచయిత సరళమైన భాషలో , చిన్న చిన్న  వాక్యాలతో పాఠకులను ఉత్కంఠ భరితంగా చదివిస్తాడు . ఈ నవలలో భగీరథ  అవలంభించిన శైలి అనితర సాధ్యం .అందుకే నాగలాదేవి నవలను పాఠకులు అంతగా ఆదరించారు .



కర్ణాటకలోని బళ్లారిలో శ్రీకృషదేవరాయ విశ్వ విద్యాలయం వారు గత సంవత్సరం నుంచి బి .యస్సీ విద్యార్థులకు పాఠంగా  దీనిని  నిర్ణయించారు . 

మళ్ళీ భగీరథ "మీర్జాపురం రాణి - కృష్ణవేణి " పుస్తకంలో కూడా అదే శైలిని అవలంభించాడు . అందుకే ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు ఆవిష్కరించిన తరువాత పాఠకుల్లో ఊహించని ఆసక్తిని కలింగించింది . 

ఇప్పుడు "మీర్జాపురంరాణి -కృష్ణవేణి "ని అందరూ ఓ బయోపిక్ అంటున్నారు . 1936లో "సతీ అనసూయ " చిత్రం ద్వారా బాలనటిగా సినిమా రంగంలో ప్రవేశించిన కృష్ణవేణి అప్పటి జయా స్టూడియోస్ నిర్మాత మీర్జాపురం రాజా వారి దృష్టిలో పడటం , వారు ఆమెను వివాహం చేసుకోవడంతో కృష్ణవేణి జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది .

కృష్ణవేణి ని వివాహము చేసుకున్న మీర్జాపురం రాజా  మేకా వెంకట్రామయ్య అప్పారావు బహదూర్  వంశ  చరిత్ర ఎంత  స్ఫూర్తి వంతగా , వీరోచితంగా ఉంటుందో  ఈ పుస్తకంలో రచయిత వివరించారు . 


రాజావారు జస్టిస్ పార్టీ , కృష్ణవేణి గారు కాంగ్రెస్ పార్టీ . ఆమెకు గాంధీగారి దర్శనం అయినా తరువాత భారత స్వాతంత్ర   సమరంలో తన తన పాత్ర కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో రాజావారు ఒద్దన్నా, తన సహకారం ఉండదని చెప్పినా  "మనదేశం" సినిమాను కృష్ణవేణి పట్టుదలతో నిర్మించారు . అదీ ఆమె అసలు సిసలు  వ్యకిత్వం , ధీరగుణం . 

కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి , ప్రతిభాశాలి . ఆమె నటి , గాయని , నిర్మాత , స్టూడియో అధినేత . 

మహా నటుడు ఎన్ .టి .రామారావు గారిని మనదేశం సినిమాలో పరిచయం చెయ్యడం , అక్కినేని నాగేశ్వర రావు గారికి కీలు గుర్రం సినిమాతో స్టార్ స్టేటస్ లభించడం . అంజలిని గొల్లభామ సినిమాలో పరిచయం చెయ్యడం .ఘంటసాలను మనదేశం సినిమాలో సంగీత దర్శకుడుగా పరిచయం చెయ్యడం ,  అదే సినిమాలో ఎస్ .వి .రంగారావు కు అవకాశం ఇవ్వడం,  సి హెచ్ .నారాయణ రావును దాపత్యం సినిమాలో హీరోగా , రమేష్ నాయుడును సంగీత దర్శకుడుగా పరిచయం చెయ్యడం , రేలంగి వెంకట్రామయ్య కు నటుడుగా ఎదగడానికి అవకాశాలు కల్పించడం .. ఇలా కృష్ణవేణి ఎంతో మంది దర్శకులు , నటీ నటులకు చేయూత నిచ్చారు . 

అంతేకాదు  ఆనాడు కృష్ణవేణి జీవితంలో జరిగిన ఘటనలతో పాటు అప్పటి సామాజిక స్థితి గతులను వివరించడం వల్ల  రచయిత మనల్ని ఆయా కాలాల్లోని తీసుకెళ్లారు . 


ఇది కదా అసలైన జీవిత చరిత్ర అంటే అని ఈ పుస్తకం చదివిన తరువాత ఎవరైనా అనుకుంటారు . ఈ పుస్తకం వెలుగు చూడటానికి కృష్ణవేణి కుమార్తె నిర్మాత అనురాధాదేవి ని అభినందించాలి . 

వందేళ్ల తెలుగు సినిమా చరిత్ర , "మీర్జాపురం రాణి -కృష్ణవేణి " పుస్తకం . ఈ పుస్తకాన్ని  పూర్తిగా సమీక్షించాలంటే మరో  ఉద్గ్రంధం అవుతుంది. రచయిత భగీరథ సామర్ధ్యాన్ని , సమర్ధతను  ఈ పుస్తకం లోకానికి  చాటుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు . 

తెలుగు పాఠకులు తప్పనిసరిగా చదవాల్చిన అపూర్వ గ్రంథం "మీర్జాపురంరాణి -కృష్ణవేణి ". 

- శ్రీమతి వీరగంధం విజయలక్ష్మి . 

ప్రతులకు : శ్రుతి బిజినెస్ సెంటర్ : 040 23555617, అచ్చంగా తెలుగు : 8558899478


Comments

Popular posts from this blog