బాలు ఎంతో సంతోషించిన రోజు
ఈరోజు నేపధ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం 75వ జన్మదినం . ప్రపంచంలో వున్న ఆయన అభిమానులంతా
దీనిని వేడుకలా చేసుకుంటున్నారు . ఆ తరం, ఈతరం, రేపటి తరం కూడా గర్వించే గొప్ప గాయకుడు , మానవతావాది గానగంధ్వరుడు బాలసుబ్రహ్మణ్యం .
2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది . తెలుగు సినిమా రంగంలో ఇద్దరు లెజెండ్స్ ను పద్మ శ్రీ అవార్డు వరించింది .ఒకరు సంగీత ప్రపంచంలో చక్రవర్తి ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం గారు కాగా మరొకరు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం జీవితమంతా అనితరమైన కృషి చేసిన మహనీయుడు డి. వి .ఎస్ రాజు గారు .
సంగీతానికి బాలు గారి కంట్రిబ్యూషన్ అనూహ్యం అలాగే రాజు గారు చేసిన సేవ కూడా అపూర్వం .
స్వర్గీయ ఎన్ .టి .రామారావు మార్గ దర్శకత్వంలో రాయలసీమ కరువు, పాకిస్తాన్ యుద్ధం , దివిసీమ తుఫాను లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు .. ఆపన్నులైన ప్రజల సహాయం కోసం రామారావు గారితో పాటు రాజుగారు వెన్నంటే ఉండి నిరంతరం శ్రమించారు . అంతేకాదు సినిమా రంగ ప్రగతి కోసం ఏర్పాటైన ట్రేడ్ బాడీ లకు దిశా నిర్దేశనం చేసింది రాజు గారే . రిచర్డ్ అట్టెన్ బరో దర్శకత్వం వహించిన "గాంధీ" సినిమా లాభాల్లో కొంత భాగం భారతీయ సినిమా కార్మికుల సంక్షేమ కోసం మూలానిధి ఏర్పాటు చేయడం కోసం అప్పటి ఎన్ ,ఎఫ్ .డి .సి చైర్మన్ గా రాజుగారు చేసిన కృషి అసమాన్యమైనది . ఆ మధుర ఫలాలను ఇవ్వాళ్టికీ ఏ ఆసరాలేని కార్మికులు అందుకుంటున్నారు
అందుకే ఈ ఇద్దరినీ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది . రాజు గారికి పద్మశ్రీ వచ్చినందుకు ,తనతో పాటు అదేరోజు ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు బాలు ఎంతో సంతోషించారు . అలాగే రాజు గారు కూడా బాలును అభినందించారు .
రెండు దశాబ్దాల క్రితం 22 మార్చి 2001వ సంవత్సరం లో న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో అప్పటి రాష్ట్రపతి కె .ఆర్ నారాయణన్ బాలసుబ్రమణ్యం గారికి , డి .వి .ఎస్ రాజు గారికి పద్మశ్రీ అవార్డు ను ప్రదానం చేశారు . తెలుగు సినిమా గర్వించతగ్గ మహనీయులు రాజు గారు, బాలు గారు
ఈ ఇద్దరూ తెలుగు సినిమా వైభవానికి, ప్రాభవానికి కృషి చేసిన గొప్ప వ్యక్తులు .
Comments
Post a Comment