భగీరథకు కళారత్న అవార్డు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథకు కళారత్న అవార్డు ను ప్రదానం చేశారు.
మార్చి 30న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు భగీరథకు కళారత్న అవార్డును బహుకరించి అభినందించారు.
జర్నలిజంలో 45 సంవత్సరాల అనుభవం వున్న భగీరథ 1997, 2001లో రెండు పర్యాయాలు అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నంది అవార్డులు , 2011లో ఎన్ .టి .ఆర్ . కమిటీ ఉత్తమ జర్నలిస్టు అవార్డు , 2020లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం , ఢిల్లీ తెలుగు అకాడమీ , వంశీ , కిన్నెర, యువకళా వాహిని, శృతిలయ , కమలాకర కళా భారతి , బళ్లారి తెలుగు సంస్కృతీ లాటి సంస్థల నుంచి 20 అవార్డులను భగీరథ స్వీకరించాడు .
నంది అవార్డుల కమిటీ , జాతీయ సినిమా అవార్డుల కమిటీ , ఆస్కార్ అవార్డుల కమిటీ సభ్యుడుగా భగీరథ పనిచేశాడు .
ఎన్ .టి .ఆర్. శత జయంతి సందర్భంగా ఏర్పాటైన కమిటీ "శకపురుషుడు ", "తారకరామం" రెండు గ్రంథాలు భగీరథ సంపాదకత్వంలో వెలువరించారు . నాగలాదేవి , మానవత, భారతమెరికా , దసరాబుల్లోడు , జమునాతీరం , నిత్యా నూతన కథానాయకుడు , మెట్టింటి గడప , సావేరి , భగీరథ పథం , అక్షరాంజలి , తెలుగు సినిమా ప్రగతి ,మహార్జాతకుడు మొదలైన గ్రంథాలను భగీరథ వ్రాశాడు .
మండలి బుద్ధ ప్రసాద్ చైర్మన్ గా ఏర్పాటైన కమిటీ సీనియర్ జర్నలిస్టు , రచయిత , కవి అయిన భగీరథను కళారత్న అవార్డుకు ఎంపిక చేసింది.
ఈ కార్యక్రమం లో దేవాదాయ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కల్చరల్ కమిటీ చైర్మన్ తేజస్వి పొడపాటీ , నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భగీరథ మాట్లాడుతూ, జర్నలిజం లో తాను చేసిన కృషిని గుర్తించి, ప్రతిష్టాత్మకమైన కళారత్న అవార్డుకు ఎంపిక చేశారని , ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారికి , అవార్డుల కమిటీ చైర్మన్ మండలి బుద్ధ ప్రసాద్ గారికి , ఎన్ .టి .ఆర్. సెంటినరీ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ గారికి, నాటక రంగ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు .
Comments
Post a Comment