ఈరోజు పద్మవిభూషణ్ బాలు 75వ జయంతి
తెలుగు వారంతా గర్వించతగ్గ నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ కళాకారుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి 75వ జయంతి . సంగీత ప్రపంచంలో ఎప్పటికీ చెరిగిపోని కీర్తి పతాక మన బాల సుబ్రహ్మణ్యం.
ఆయన భౌతికంగా మన మధ్యన లేరు కానీ ఆయన పాట , ఆయన మాట మనతోనే వున్నాయి . మన మనసులో పల్లవిస్త్తూనే వున్నాయి . గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ సినిమా ప్రపంచంలో చీకటి రోజు. కరోనా అనే మహమ్మారి బాలు గారిని మనకు దూరం చేసింది . ఎవరూ ఊహించ లేదు బాలు గారు మన మధ్యనుంచి వెళ్ళిపోతారని . ఈ వార్త విని యావత్ సినిమా ప్రపంచం నివ్వెరపోయింది . తెలుగువారంతా తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టు విషాదంలో మునిగిపోయింది . సంగీత ప్రపంచం మౌనంగా రోదించింది .
బాలు గారు తాను సాధించిన ఘన విజయాలను చరిత్రగా మనకు అప్పగించి సెలవంటూ వెళ్లిపోయారు .
1966 వ సంవత్సరంలో " శ్రీశ్రీ మర్యాద రామన్న" సినిమాతో గాయకుడుగా నటుడు, నిర్మాత, దర్శకుడు పద్మనాభం గారు పరిచయం చేశారు . అక్కడ నుంచి బాలు గారు చనిపోయేంత వరకు సినిమాలో ,టీవీ లో తన గళం వినిపిస్తూనే వున్నారు . తెలుగు, తమిళ, కన్నడ , హిందీ తదితర భాషల్లో ఆయన 40,000 పాటలను పాడారు
6 జాతీయ అవార్డులు , 6 ఫిలిమ్ ఫేర్ అవార్డులు, 24 ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులు, 4 తమిళ రాష్ట్ర అవార్డులు, 3 కర్ణాటక రాష్ట్ర అవార్డులు , లెక్కలేనన్ని ప్రైవేట్ అవార్డులు, సన్మానాలు , సత్కారాలు , డాక్టరేట్ గౌరవాలు బాలు కీర్తి కిరీటంలో ఒదిగి పోయాయి .
భారత ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ ,2011లో పద్మభూషణ్ , 2021లో పద్మవిభూషణ్ అత్యున్నత పురస్కారాలు వరించాయి
బాలు గాయకుడుగా , సంగీత దర్శకుడుగా , నటుడుగా బహు ముఖాలుగా ఎదిగారు , అయినా ఎంత ఎత్తుకు ఎదిగినా , ఎన్ని అతున్నంత పురస్కారాలు వచ్చినా వినమ్రంగా ఒదిగి వున్న మహా కళాకారుడు, మానవతా మూర్తి , అందరికీ అత్యంత ఆప్తులు బాలు గారు.
1996లో మిత్రులు ప్రసాదరెడ్డి, అంజిరెడ్డితో నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నిర్మించిన "ప్రియమైన శ్రీవారు " సినిమా పాటల రికార్డింగ్ చెన్నైలో కోదండపాణి థియేటర్లో ప్రారంభమైంది. మొదటి పాటను సామవేదం షణ్ముఖ శర్మ గారితో వ్రాయించాము . ఈ పాటను బాలు గారే పాడారు . అప్పటి నుంచి బాలు గారితో ఆత్మీయ పరిచయం, ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా మాట్లాడేవారు . అలాంటి బాలు ఇక లేరు అనే వార్త ఇప్పటికీ నమ్మలేకుండా వున్నాను . ఆయన అందరితోనూ చాలా ఆత్మీయంగా ఉండేవారు .
ప్రపంచంలో బాలు సంగీతాభిమానులు కోట్లలో వున్నారు , పాడుతా తీయగా , స్వరాభిషేకం తో వేలాది మంది గాయని గాయకులకు మార్గదిర్ధేశనం చేశారు . తన సంగీత వారసులను .తయారు చేసి మరీ వెళ్లిపోయారు .
సంగీతానికి బాలు గారు చేసిన కృషీ , ఆయన పంచిన మధుర గీతాలు ఎప్పటికీ మనకి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి
Comments
Post a Comment