40 ఏళ్ల నాటి నాగార్జున  'విక్రమ్' 

అక్కినేని నాగార్జున నటించిన 'విక్రమ్ ' సినిమా విడుదలై ఈరోజుకు (23 మే 986) 40 సంవత్సరాలు. 

నాగార్జున సినిమా జీవితం ప్రారంభించి అప్పుడే నాలుగు దశాబ్దాలు అవుతుందా?

కాలం ఎంత వేగంగా గడిచిపోతుంది ? 

1979 ఫిబ్రవరిలో  నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే 'జ్యోతి చిత్ర' సినిమా వార పత్రిక లో  రిపోర్టర్ గా చేరాను . 

అప్పటి నుంచి నాగేశ్వర రావు గారితో నాకు పరిచయం వుంది .అప్పటి నుంచి తరచుగా వారిని కలుస్తూ ఉండేవాడిని. 

1984లో నాగేశ్వర రావు గారు నటుడుగా 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక రోజు నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు .


అప్పుడు నాగేశ్వర రావు గారు బంజారా హిల్స్ లో ఉండేవారు . నేను వెళ్లిన తరువాత  హాల్ లోని రమ్మన్నారు . 

సాయంత్రం వేళ నేను వెడితే వారితో హాల్ లోనే కూర్చునేవాడిని .

తన 40 సంవత్సరాల సినిమా జీవితం గురించి ఒక ఆర్టికల్ కావాలని నన్ను అడిగారు .

'40 సంవత్సరాల మీ సినిమా జీవితం గురించి నేనా ? అన్నాను' ఆశ్చర్యంగా . 


'మీరు రాయగలరు . నేను మద్రాసులో వున్నప్పుడు నా ఆలోచనలకు దగ్గరగా ముళ్ళపూడి వెంకట రమణ గారు వ్రాసేవారు . హైదరాబాద్ వచ్చిన తరువాత మళ్ళీ నా ఆలోచనలకు దగ్గరగా మీరు రాస్తున్నారు ' అని చెప్పారు .

నేను మాట్లాడ లేదు . కాసేపటి  రెండురోజులు సమయం ఇవ్వండి అని చెప్పాను . తరువాత రాసి తీసుకెళ్ళాను . చిన్న మార్పులు చేర్పులు చెప్పారు . అలా మార్చి తీసుకెళ్ళాను . దాన్ని నాగేశ్వరరావు గారు బాగుందని చెప్పి , ఆ తరువాత రోజు ఆకాశవాణిలో చదివారు . ఆ ప్రసంగానికి శ్రోతల నుంచి ఊహించని స్పందన వచ్చింది . ఒక వార రోజుల తరువాత మళ్ళీ దానిని పునః ప్రసారం చేశారు .

ఆ తరువాత దాసరి సారధ్యంలో అక్కినేని పుట్టినరోజున ఆంధ్ర జ్యోతి దిన పత్రిక లో ' 40 సంవత్సరాల అక్కినేని ప్రత్యేక సంచిక ' 40 పేజీలతో వెలువడింది . ఆ ప్రత్యేక సంచికను కూడా నేనే విజయవాడ వెళ్లి దగ్గరుండి తయారు చేయించాను . నాగేశ్వర రావు గారికి , దాసరి నారాయణ రావు గారికి బాగా నచ్చింది . 


అప్పటి నుంచి నన్ను ఆహ్వానించేవారు . రాంగోపాల్ వర్మ గారి నాన్న కృష్ణం రాజు గారు లేదా కళాదర్శకులు  సుబ్బారావు గారు , లేదా  ఏలూరు నుంచి వాళ్ళ బావమరిది కొడాలి వెంకటేశ్వర రావు గారు వచ్చినప్పుడు కూడా నన్ను ఆహ్వానించేవారు.

అలా నాగేశ్వర రావు గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా నన్ను భోజనం చెయ్యకుండా వదిలిపెట్టేవారు కాదు . అన్నపూర్ణమ్మ  గారు వడ్డించేవారు.

మొదటిసారి వాళ్ళ ఇంట్లో దంపుడు బియ్యం తో వండిన అన్నం తిన్నాను .  

1984లో నాగార్జునతో లక్ష్మి  వివాహం జరిగినప్పుడు కూడా నాగేశ్వర రావు గారి తరుపున మీడియా ను నేనే ఆహ్వానించాను.

1985 ఆగష్టు రెండవ వారంలో ఇంటికి రమ్మని ఫోన్ చేశారు. ఆరోజు సాయంత్రం నేను వెళ్ళాను . 

'నాగార్జునను  హీరోగా పరిచయం చేద్దామని అనుకుంటున్నట్టు గతంలో మీకు చెప్పాను . ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేశాము . 

వి .మధుసూదన రావు గారిని దర్శకుడుగా నిర్ణయించాము . నాగార్జునను హీరోగా పరిచయం చేస్తున్నట్టు ప్రకటిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా ' అని నావైపు చూశారు . 

'మీరు ప్రకటించడమే కరెక్ట్. ' అన్నాను .

అయితే  ప్రెస్ మీట్ పెట్టి నాగార్జునను పరిచయం చేద్దాము ' అన్నారు .

తప్పకుండా , మీరు ఎప్పుడు అనేది చెబితే మీడియా మిత్రులకు సమాచారం పంపిద్దాము ' అన్నాను .

'నేను మీకు కబురు చేస్తాను ' అన్నారు .


ఆగష్టు 21న  అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నాగేశ్వర రావు గారు నాగార్జునను హీరోగా పరిచయం చేస్తున్నామని . ఈ సినిమా తన 61వ పుట్టినరోజు సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుందని ప్రకటించారు . 

ఈ సినిమా  శ్రీమతి అన్నపూర్ణమ్మ సమర్పణలో వెంకట్ అక్కినేని నిర్మిస్తున్నట్టు చెప్పారు . 

1985 సెప్టెంబర్ 20న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వర రావు గారి 61వ పుట్టినరోజున 'విక్రమ్ 'సినిమా ప్రారంభోత్సవం ఏర్పాట్లు జరిగాయి . మొదటి ఫ్లోర్ ఎదురుగా వున్న కల్యాణ మండపం లో ముహూర్తం షాట్ తీయడానికి ఏర్పాట్లు చేశారు .

నాగార్జున, శోభన మీద తీసిన షాట్ కు దర్శకుడు కె .రాఘవేంద్ర రావు క్లాప్ ఇవ్వగా , మరో దర్శకుడు దాసరి నారాయణ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు . 

ఈ ప్రారంభోత్సవానికి మద్రాసు నుంచి నడిగర తిలకం శివాజీ గణేశన్ వచ్చి నాగార్జునను ఆశీర్వదించారు .

నందమూరి తారకరామా రావు తరుపున వారి పెద్ద అబ్బాయి జయకృష్ణ వచ్చారు . 

ఈ సినిమా ప్రారంభోత్సవంలో శ్రీమతి అన్నపూర్ణమ్మ , శ్రీమతి లక్ష్మి నాగార్జున పాల్గొని ఆసక్తిగా వీక్షించారు . 

ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వర రావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .  





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు